బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన మాటకు కట్టుబడి ఉన్నారు . “ఓటీటీ ని బాయ్కాట్ చేస్తా… నా సినిమాలు ఇకపై థియేటర్లకే పరిమితం!” అని గతంలో ప్రకటించిన అమీర్… ఇప్పుడు ఆ మాటను నిజం చేస్తూ ‘సితారే జమీన్ పర్’ సినిమాను ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు.
ఇదివరకు ఈ సినిమా ఓటీటీలో నేరుగా రాబోతోందని వార్తలు వచ్చినా… తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఇది జూన్ 20, 2025న థియేటర్లలో విడుదల కానుంది. అంతేకాదు… ఇతర సినిమాల్లా ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రాకుండా, యూట్యూబ్లో రీలీజ్ చేయబోతున్నారు. కానీ ఫ్రీగా కాదు — పేమెంట్ మీదే!
2007లో విడుదలైన ‘తారే జమీన్ పర్’ కు ఇది స్పిరుట్యువల్ సీక్వెల్. ఈసారి అమీర్ ఖాన్ సరసన జెనీలియా దేశ్ముఖ్ కనిపించనున్నారు. స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవలి వేవ్స్ సమ్మిట్ లో మాట్లాడిన అమీర్, ఓటీటీల వల్ల థియేటర్ కల్చర్ దెబ్బతింటుందన్న అభిప్రాయం వెల్లడించారు:
“ఒకప్పుడు సినిమా 8 నెలల తర్వాత టీవీలో ప్రసారమయ్యేది. ఇప్పుడు రెండు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. దీంతో ప్రేక్షకుల్లో థియేటర్కు వెళ్లే మోటివేషన్ తగ్గిపోయింది. ఇదే కొనసాగితే సినిమాలు హిట్ కావడం కష్టం.”
అందుకే… తన సినిమాలను ఇకపై ఓటీటీలో విడుదల చేయనని, పెద్ద స్క్రీన్ అనుభూతిని మాత్రమే ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటను ‘సితారే జమీన్ పర్’ రూపంలో నిలబెట్టుకుంటున్నారు.